భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో స్వైర విహారం

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి 7.30 గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ జుల్ఫికర్‌ కాలనీలో తిరిగారు. 

దాంతో.. స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, పొలం పనులకు వెళ్లిన వారు నిద్రపోయే సమయమని, శబ్దం చేస్తూ తిరగవద్దని చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. క్షణాల్లో బట్టీగల్లీ, పంజేషా చౌక్‌, కోర్బగల్లీ, బస్టాండ్‌ ఏరియాతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. 

ఓ వర్గం యువకులు.. ప్రత్యర్థి వర్గం వారికి చెందిన రెండు ఆటోరిక్షాలు, ఒక కారు, మరో రెండు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. జనావాసాలపై రాళ్లు రువ్వారు. కత్తులతో కాలనీల్లో స్వైర విహారం చేశారు. గృహ దహనాలకు పాల్పడ్డారు. ఒక కూరగాయల దుకాణాన్ని తగులబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటనలో దేవా, విజయ్, ప్రభాకర్ అనే ఆంధ్ర జ్యోతి, ఈనాడు, రాజ్ న్యూస్ జర్నలిస్టులకు ‌  గాయాలయ్యాయి. దేవా, విజయ్‌ పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాళ్ల దాడిలో ఓ పోలీసు అధికారి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఘర్షణలో మరో నలుగురు యువకులు గాయపడ్డారు. 

క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి 10కల్లా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో.. భైంసాలో అదనపు బలగాలను మోహరించారు. ఆయా ప్రాంతాల్లోని అల్లరి మూకలను చెదరగోడుతూ పరిస్థితిని, మెరుగు పర్చేందుకు ప్రయత్నించారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు భైంసాకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఈ అల్లర్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ అల్లర్లలో  పోలీసులు, జర్నలిస్టులు, బిజెపి కార్యకర్తలు  గాయపడటం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అల్లరిమూకలు జర్నలిస్టులు, పోలీసులపై దాడి చేస్తారా? మనం భారత్ లో ఉన్నామా ? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాయవద్దని సంజయ్ హెచ్చరించారు. వెంటనే అల్లర్లు ఆపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఉండడం వల్లననే అక్కడ తరచూ అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వీటిని రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ కు తగ్గారలించాలని సూచించారు. 

 

READ MORE: భైంసాలో బీభత్సం: ఇళ్ళు దగ్ధం.. ఉద్రిక్త పరిస్థితులు

భైంసా: మతఘర్షణల్లో నివాసం కోల్పోయిన నిర్వాసితుల ఇళ్ల కోసం సేవాభారతి భూమిపూజ