ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం మధ్యాహ్నం ప్రకటించింది. భారత్ వేదికగానే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు జరగనుండగా.. ఏప్రిల్ 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో మే 30న జరగనుండగా, టోర్నీ ఆరంభ మ్యాచ్లకు ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్లు జరగనుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ రూపంలో మొత్తం ఆరు సిటీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్ వేదికగా జరగనుండగా, ఈ ఏడాది మొత్తం 11 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం మ్యాచ్లు 3.30 గంటలకు ప్రారంభం కానుండగా, రాత్రి మ్యాచ్లు 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
చెన్నై, ముంబయి, కోల్కతా, బెంగళూరు పదేసి మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుండగా, అహ్మదాబాద్, ఢిల్లీలో ఎనిమిదేసి మ్యాచ్లు జరగనున్నాయి. వాస్తవానికి తొలుత హైదరాబాద్లోనూ ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్కరు కూడా హైదరాబాద్కి చెందిన ఆటగాడు లేకపోవడంతో ఉప్పల్లో జరిగే మ్యాచ్లను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.
దానికి తోడు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అంతర్గత కుమ్ములాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుండటంతో హైదరాబాద్ స్థానంలో బీసీసీఐ ఢిల్లీని ఎంచుకుంది. హైదరాబాద్లో మ్యాచ్లను నిర్వహించాలని మంత్రి కేటీఆర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఇటీవల కోరినా ఫలితం లేకపోయింది.
More Stories
ఎన్నికల కమిషన్ ను నియంత్రించలేం
అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్
భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు