బీజేపీలో చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ

తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
 
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ  ‘‘దినేశ్ త్రివేదీని బీజేపీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. సరైన వ్యక్తి తప్పుడు పార్టీలో ఉన్నారని పదే పదే నేను చెబుతుండేవాణ్ని. ఇప్పుడు సరైన వ్యక్తి, సరైన పార్టీలోకి వచ్చారు. బెంగాల్ ఎన్నికల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు. 
 
ఇక బీజేపీలో చేరిన తర్వాత దినేశ్ త్రివేదీ మాట్లాడుతూ… ‘‘కొన్ని పార్టీలు ప్రజలకు సేవ చేయవు. వారి వారి కుటుంబాలకు సేవ చేసుకుంటాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చాలా మంది నన్ను అడుగుతుంటారు. ప్రస్తుత ప్రభుత్వ సారథ్యంలో భారీగా అవినీతి జరుగుతోంది అని చెప్పా’ అని చెప్పారు. 
 
తాను ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా తాను మాత్రం క్రియాశీలకంగా ఉంటానని  ఆయన ప్రకటించారు.  తృణమూల్‌ను బెంగాల్ ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, అవినీతిని, హింసను కాదని స్పష్టం చేశారు. నిజమైన మార్పుకు బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
 
కాగా, టీఎంసీ నేత దినేష్ బజాజ్ తాజాగా పార్టీ నుంచి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పేర్లను టీఎంసీ ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.తన అసంతృప్తికి కారణాలను వివరిస్తూ, హిందీ మాట్లాడే ప్రజలను బయట వ్యక్తులంటూ టీఎంసీ మాట్లాడటం తనను కలవరపరిచిందని తెలిపారు.