ఆఫ్ఘన్ కాల్పుల్లో ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మహిళా జర్నలిస్టులు చనిపోయారు. రెండు వేర్వేరు సంఘటనల్లో వీరు ముగ్గురు చనిపోయారు. వీరు ఎనికాస్‌ రేడియో, టీవీలో ఉద్యోగులు. భారత్‌కు చెందిన ఒక సీరియల్‌ను ఆఫ్ఘాన్‌లోకి తర్జుమా చేయడంలో వీరు మగ్గురు గత కొంతకాలంగా నిమగ్నమై ఉన్నారు. 

ఈ విషయాన్ని అక్కడి మీడియాతోపాటు ఎనికాస్‌ టీవీ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ఉదయం రెండు వేర్వేరు కాల్పుల సంఘటనల్లో ముగ్గురు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. వీరు ముగ్గురు కూడా స్థానిక ఎనికాస్‌ రేడియో, టీవీలో పనిచేస్తున్నారు.

గురువారం ఉదయం జలాలాబాద్‌లో నివసిస్తున్న సాదియా, షెహనాజ్‌లు ఇంటికి సమీపంలో వాకింగ్‌ చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. దాంతో వీరిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కాగా, మరో ప్రాంతంలో ముర్సాల్‌ హబీబీ అనే ఉద్యోగిపై కూడా కాల్పులు జరిపారు. ఆమె కూడా స్పాట్‌లోనే చనిపోయింది.

వీరు ముగ్గురు గత కొంతకాలంగా భారతదేశానికి చెందిన పలు డ్రామాలు, సీరియళ్లను స్థానిక భాషల్లోకి డబ్బింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నరని ఎనికాస్‌ టీవీ డైరెక్టర్‌ జలమాయ్‌ లతీఫ్‌ చెప్పారు.  గత కొన్నాళ్లుగా ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు పరంపర కొనసాగుతున్నది. 2020 డిసెంబర్‌ 10 వ తేదీన మహిళల హక్కుల కార్యకర్త మలాలై మావాద్‌ను కూడా ఇలాగే  కాల్చిచంపారు.