బీజేపీలో చేరిన ఇద్దరు హైకోర్టు మాజీ జడ్జీలు

కేరళకు చెందిన ఇద్దరు మాజీ జడ్జీలు భారతీయ జనతా పార్టీలో చేరారు. కేరళ హైకోర్టులో జడ్జీలుగా పని చేసిన పీఎన్ రవీంద్రన్, వి చితంబరేష్‌లు మరో 18 మందితో కలిసి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

కేరళలోని ఎర్నాకులంలో కొనసాగుతున్న విజయయాత్ర ఇందుకు వేదికైంది. ఈ ఇద్దరు జడ్జీలతో పాటు మాజీ డిజిపి వేణుగోపాల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ జనరల్ మేనేజర్ సోమచూదన్, మిలిటరీ మాజీ అధికారి (రేర్ అడ్మిరల్) బీఆర్ మీనన్‌లతో సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరారు.

అయితే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన చితంబరేష్‌.. ప్రత్యక్ష చేరికలో లేరు. ఢిల్లీలో ఉన్న ఆయన.. అక్కడి నుంచే సభ్యత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. 

పలక్కడ్‌లోని విక్టోరియా కాలేజీలో బీజేపీకి చాలా కాలం మద్దతుదారుగా ఉన్నట్లు వెల్లడించారు. బీజీపీలో చేరిన ఇద్దరు జడ్జీలు.. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన ‘లవ్ జిహాదీ’ బిల్లుకు మద్దతిచ్చారు.

 కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజపీ పరిశీలకుడు కైలాష్ విజయవర్గీయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బీజేపీ కో-ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ సమక్షంలో ఆమె సోమవారంనాడు బీజేపీ తీర్ధం తీసుకున్నారు. 

1997లో ‘మయర్ బధోన్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన చటర్జీ ఆ తరువాత ‘ఛాంపియన్’, ‘అమానుష్’, ‘కనమచి’, ‘జియా పగ్లా’, ‘ఛోబియల్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. గత నెలలో ప్రముఖ బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా కూడా బీజేపీలో చేరారు. వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలని, బీజేపీ ఎప్పుడూ యువతను ప్రోత్సహిస్తూ వస్తోందని చెప్పారు.