బాలకోట్ దాడికి గుర్తుగా ఐఎఎఫ్ విన్యాసాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు జరిపి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఆనాడు దాడిలో పాల్గొన్న పైలట్ల తో కలసి ఐఎఎఫ్ చీఫ్ ఆర్‌కె ఎస్ భదౌరియా ఈ విన్యాసాలు నిర్వహించారు. 
 
 బాలాకోట్‌ ఆపరేషన్‌ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం తాజాగా ప్రయోగాత్మకంగా లాంగ్‌ రేంజ్‌ స్ట్రైక్‌ నిర్వహించింది. ప్రాక్టీస్‌ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు  తెలిపాయి. సుదూర పరిధి నమూనా లక్షాలపై బాంబుల దాడులు సాగించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపినదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా అదే ఏడాది ఫిబ్రవరి 27న బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు చేశాయి.
 
భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన ఫైటర్‌ జెట్లు నియంత్రణ రేఖను (ఎల్‌ఓసీ) దాటి, పాకిస్తాన్‌ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు 400 మంది ఉగ్రవాదులు మృతి చెంది ఉంటారని అంచనా.