కపిలవాయి పోటీ నుండి విరమణ, తిరిగి బిజెపిలోకి 

మహహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి వేసిన టీఆర్ఎల్డీ తరపున వేసిన నామినేషన్ ను కపిలవాయి దిలీప్ కుమార్ ఉపసంహరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన తిరిగి బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరడంతో తన నామినేషన్ ను ఉపసంహరించుకొని, ఆ పార్టీ నుంచి  పోటీ చేస్తున్న ఎన్  రామచంద్రరావుకు తన మద్దతు తెలిపారు. బండి సంజయ్ తన ఆఫీసుకు వచ్చి కోరడంతోనే నామినేషన్  విత్ డ్రా చేసుకుని, బిజెపిలో చేరినట్టు ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్ ఓ కుటిల రాజకీయ వేత్త అని, రాజకీయ అవగాహన లేని వారికి కూడా తెలుసని ఈ సందర్భంగా కపిలవాయి ధ్వజమెత్తారు.  ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయాక పీవీ ని కేసీఆర్ తో కలిసి ఢిల్లీలో కలిశామన్న దిలీప్ .. ఆనాడు ఢిల్లీలో పీవీని  సమైక్యవాది అని కేసీఆర్ అన్నారని , అలాంటి చంద్రశేఖర్ రావు కి ఈరోజు పీవీ జ్ఞాపకం రావడం ఏమిటని ఎద్దేవా చేశారు.

పీవీ కూతురు వాణీ ఎమ్మెల్సీ  అభ్యర్ధిత్వంతో కుల పంచాయితీ పెట్టాలని, బ్రాహ్మణ ఓట్లు దండు కుందామని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కు పీవీ మీద ఏనాడు ప్రేమ లేదని పేర్కొంటూ  వాణి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలిపశువు కాబోతోందని విచారం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎవరికీ అవకాశం వచ్చిన వారు వినియోగించుకోవాలని, విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని దిలీప్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని,  ఢిల్లీలో ఏ రోజు సీఎం చుట్టూ ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దాడులు  మొదలవుతాయో తెలియదని పేర్కొన్నారు.