గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది.కల్యాణమస్తు సామూహిక వివాహాలకు మరిన్ని ముహూర్తాలు నిర్ణయించాలని పండిత మండలిని కోరింది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కల్యాణమస్తు వివాహాలను నిర్వహించాలని నిర్ణయించారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం రాత్రి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  గుడికో గోమాత కార్యక్రమం దేశ వ్యాప్తంగా మరింత వేగంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

చైర్మన్  సుబ్బారెడ్డి మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శనివారం జరిగే టిటిడి  పాలక మండలి సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు. దీనివల్ల  గోవధను అరికట్టడానికి అవకాశం  ఏర్పడుతుందని  విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ నుంచి 31 ఆలయాలు గోమాత కోసం దరఖాస్తు చేసుకున్నాయని అధికారులు వివరించారు. ఆలయాల్లో గోవు, దూడకు తగిన వసతి,వాటి పోషణకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించి 10 రోజుల్లో గోవులను అందించాలని అధికారులను ఆదేశించారు.

పట్టణాల్లో వీధుల్లో తిరిగే గోవులను గోశాలలకు తరలించి అవసరమైతే వాటి పోషణకు టీటీడీ ద్వారా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కళ్యాణ మస్తు వివాహాలు నిర్వహించాలని నిర్ణయించారు.  టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.