టీమిండియా టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన కోహ్లీ 

ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం ద్వారా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 
ఇప్పటివరకు కోహ్లి సారధ్యంలో స్వదేశంలో 29 టెస్టులాడిన టీమిండియా 22 విజయాలు సాధించింది. తాజాగా పింక్‌ బాల్‌ టెస్టు విజయంతో ధోనిని కోహ్లి అధిగమించాడు. కాగా ధోని సారధ్యంలో స్వదేశంలో టీమిండియా 21 విజయాలు సొంతం చేసుకుంది.

ఇక ఓవరాల్‌గా కోహ్లి సారధ్యంలో భారత్‌ ఇప్పటివరకు 59 టెస్టులాడి 35 విజయాలు సాధించింది. స్వదేశం, విదేశం కలుపుకొని టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించి పెట్టిన కెప్టెన్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి తర్వాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 21 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

కాగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు విజయంతో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఐదు రోజులు జరుగవలసిన ఆట రెండు రోజులలో ముగియడం పట్ల కోహ్లీ విచారం వ్యక్తం చేశారు. రెండు జట్లలో బ్యాటింగ్ బాగా జరగలేదని ఒప్పుకున్నారు. 

ఇలా ఉండగా, సూపర్ ఫామ్‌లో ఉన్న టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న అశ్విన్‌ టెస్టు క్రికెట్‌లో 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్‌(3/26, 4/48) ఏడు వికెట్లు పడగొట్టాడు. 

జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌ వేదికలోనే జరగనుంది.