`ఆంధ్రజ్యోతి’ని బహిష్కరిస్తున్న ఏపీ బిజెపి 

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్  లో చర్చ సందర్భంగా బుధవారం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై చర్చలో పాల్గొన్న మరోవ్యక్తి టివి కెమెరా సాక్షిగా దాడి చేసినా ఏమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్న ఆ ఛానల్ యాజమాన్యం పట్ల బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అందుకు నిరసనగా ఏబీఎన్ చానెల్, ఆంధ్రజ్యోతి దినపత్రికను బహిష్కరిస్తున్నట్లు ఏపీ బీజేపీ నాయకత్వం ప్రకటించింది.

ఆ పార్టీ మీడియా ఇన్చార్జి వల్లూరి గంగాధర్ ఆ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఇక నుంచి బహిష్కరిస్తున్నదని ప్రకటించారు.

  ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది.  విష్ణువర్ధన్ రెడ్డిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి మరుసటి  రోజు చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటని బిజెపి మండిపడింది.

తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ఆంధ్రజ్యోతి పత్రికను భారతీయ జనతా పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించిన్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర బిజెపి యొక్క ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ, ఎబిఎన్ ఛానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి,  వారిని పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, ఎబిఎన్ ఛానెల్‌పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర అనువైన చర్యలకై బిజెపి ఉపక్రమిస్తుందని హెచ్చరించింది.