వృద్ధులకు మార్చ్ 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్లు

వృద్ధులు, బహుళ వ్యాధులుగలవారు వచ్చే నెల 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను పొందవచ్చు. 60 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళ వయసు పైబడినవారు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులు. ప్రైవేటు ఆసుత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దాదాపు 10 వేల ప్రభుత్వ, సుమారు 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే లభిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ చేయించుకోవాలనుకునేవారు సొమ్ము చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.

నిర్దిష్టంగా ఎంత సొమ్ము చెల్లించాలనే విషయంపై మూడు లేదా నాలుగు రోజుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ అంశంపై మాన్యుఫ్యాక్చరర్లు, ఆసుపత్రులతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ జరిగిన తీరును ప్రస్తావిస్తూ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం 7 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. 2,54,356 సెషన్స్‌లో వ్యాక్సినేషన్ చేసినట్లు చెప్పారు. 

 64,98,300 మంది హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి డోసు, 13,98,400 మంది హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, 42,68,898 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి డోసు ఇచ్చినట్లు తెలిపారు.  ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో జరుగుతోంది. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

రెండో డోసు వ్యాక్సినేషన్ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులు పూర్తయిన అనంతరం రెండో డోసు ఇస్తున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 2 నుంచి ప్రారంభమైంది.

 కాగా, పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు బుధవారం నాడు తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. నిబంధనల అమలు పరచడంలో ఏ మాత్రం అలసత్వం పాటించినా పరిస్థితి మరింత దిగజారుతుందని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.

ముగ్గురు నిపుణులు ఉండే ఒక్కో  బృందానికీ కేంద్ర ఆరోగ్య శాఖలోని అదనపు సెక్రెటరీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. రోజువారీ కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్, రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ సంఖ్యలో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని సూచించింది.