కాంగ్రెస్, లెఫ్ట్ కేరళలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ

కాంగ్రెస్ పార్టీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎజెండాతో ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్, రాహుల్ గాంధీ, లెఫ్ట్ పార్టీలు కపట రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా ఉన్నాయని, కానీ కేరళలో మాత్రం ఇవి ప్రత్యర్థి పార్టీలుగా పోటీపడుతున్నాయని  విమర్శించారు. కేరళలో కుస్తీ, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో దోస్తీ.. ఇదెక్కడి రాజకీయమని ఆయన మండిపడ్డారు. 

‘‘ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు కేరళలో కుస్తీకి దిగుతాయి. ఇవే పార్టీలు మళ్లీ ఢిల్లీలో దోస్తీ చేస్తాయి. మమతా బెనర్జీ కూడా అంతే. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారు. బెంగాల్‌లో కుస్తీ పడతారు. ఇదేం విచిత్రం. ఈ పార్టీలకు ఉన్న ఎజెండా ఏంటి? ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నాయి” అని ప్రశ్నించారు

ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే నినాదంతో ఒకే నడవడికతో ముందుకు పోతోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతారని, కానీ బెంగాల్ విషయంలో మాత్రం ఆమె కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తారని, ఇదెక్కడి విడ్డూరమని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీని తాను ఒకటే అడగాలనుకుంటున్నానని, ఆయన ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారో, కపట విధానాలను పాటిస్తారో తేల్చి చెప్పాలని నిలదీశారు. రాజకీయం అంటే అధికారం చేజిక్కించుకోవడం కాదని, దానికోసం ఇక్కడ ఓ పార్టీతో అంటకాగడం, అక్కడ మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎంత మాత్రం సరి కాదని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కలిగి ఉండడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పై యాక్టర్‌లా ఉన్నారని, ఆయన రైతులకు, ఏపీఎంసీ (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లకు మద్దతుగా ఉంటే మరి కేరళలో ఏపీఎంసీలు ఎందుకు లేవని నిలదీశారు.

దీనిపై రాహుల్ ఎందుకని నోరు మెదపరని ప్రశ్నించారు. అలాగే పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ ఓ చట్టం తీసుకొచ్చిందని, దానిని రైతులు అతిక్రమిస్తే వారికి జైలుకు పంపించేందుకు కూడా అవకాశం ఉందని, వీటిపై రాహుల్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధిస్తుందని, పుదుచ్చేరిలో తిరిగి ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఇక కేరళలో కూడా ప్రస్తుతం బీజేపీ అనుకూల పవనాలు మొదలయ్యాయని, అతి త్వరలో అనేక మార్పులు చవిచూస్తారని చెప్పారు.