పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

పుదుచ్చెరి అసెంబ్లీలో సోమ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి త‌న మెజార్టీ నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మయ్యారు. దీంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 
 
విశ్వాస ప‌రీక్ష‌లో విఫ‌ల‌మైన త‌ర్వాత నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన ఆయ‌న  లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి రాజీనామా అంద‌జేశారు. మెజార్టీ నిరూపించుకోవ‌డానికి 14 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం కాగా.. కాంగ్రెస్ ద‌గ్గ‌ర 12 మంది స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉంది. 
 
ఆదివారం ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడింది.  తాజాగా రాజీనామా చేసిన వారిలో ఒకరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాగా, మరొకరు భాగస్వామ్య పార్టీ డీఎంకే ఎమ్మెల్యే. గత వారం నలుగురు ఎమ్యెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆయన విశ్వాస పరీక్షకు సిద్ధం కావలసి వచ్చింది.
 
విశ్వాస ప‌రీక్ష‌లో ఓటింగ్‌కు ముందు మాట్లాడిన నారాయ‌ణ‌స్వామి  త‌మ‌కు మెజార్టీ ఉన్న‌ద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా మాజీ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీపై త‌న ప్ర‌భుత్వాన్నిప‌డ‌గొట్ట‌డానికి ప్ర‌తిప‌క్షంతో చేతులు క‌లిపిన‌ట్లు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.