బుద్గాంలో ముగ్గురు ఉగ్రవాదులు హతం.. పోలీస్‌ అధికారి మృతి

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిందని జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో జమ్మూకాశ్మీర్‌కు పోలీస్‌ విభాగానికి చెందిన ఎస్పీఓ మహ్మద్‌ అల్తాఫ్ మృతి చెందగా.. మరో పోలీస్‌ అహ్మద్‌ గాయపడ్డారని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.
 
బుద్గాం ప్రాంతంలో ఉగ్రవాదాలు ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో గుర్తు తెలియని ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు గురువారం రాత్రి షోపియాన్‌ ప్రాంతంలోనూ మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆయా ఘటనలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.