గల్వాన్ లో ఐదుగురు మృతి చెందిన్నట్లు చైనా ప్రకటన 

భారత్‌- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారి తీసిన గల్వాన్  ఘటనలో మృతి చెందిన తమ సైనికుల వివరాలపై డ్రాగన్‌ దేశం తొలిసారిగా నోరు విప్పింది. ఈ విషయమై ఇప్పటి వరకు మౌనం వహిస్తూ వస్తున్న చైనా  తూర్పు లదాఖ్‌ ఘర్షణలో ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు, సైనికులు అమరులైనట్లు తెలిపింది. 

క‌ర‌కోర‌మ్ ప‌ర్వ‌త‌శ్రేణుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న అయిదురు సైనిక బ‌ల‌గాల‌కు చెందిన వారు మృతిచెందిన‌ట్లు సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మిష‌న్ ఆఫ్ చైనా వెల్ల‌డించింది. ఈ మేరకు మృతుల పేర్లను కూడా చైనా విడుదల చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. షిన్‌జియాంగ్‌ మిలిటరీ కమాండర్‌ కీ ఫబావోతో పాటు, చెన్‌ హోంగ్జన్‌, చెన్‌ షియాన్‌గ్రాంగ్‌, షియాలో సియువాన్‌, వాంగ్‌ జురాన్‌ మృతిచెందినట్లు పేర్కొంది. వీరికి గౌరవ హోదాలు కల్పించినట్లు తెలిపింది.

ఇందుకు సంబంధించి సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అదే విధంగా భారత్‌తో జరిగిన ఘర్షణలో ఆర్మీని ముందుండి నడిపించిన కల్నల్‌కు సముచిత గౌరవం కల్పించినట్లు పేర్కొంది.

అయితే చైనా సైనికులు 60 మందికి పైగా మృతి చెందిన్నట్లు అమెరికాతో పాటు పలు అంతర్జాతీయ నిఘా వర్గాలు వెల్లడించడం తెలిసిందే. 45 మంది చైనా సైనికులు ఈ సందర్భంగా మృతి చెందిన్నట్లు రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ ఈ నెల 10న ప్రకటించింది.

కాగా గతేడాది జూన్‌లో, వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లు- డ్రాగన్‌ ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. డ్రాగన్‌ ఆర్మీ దురాగతానికి కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే చైనా మాత్రం ఈ ఘటనలో తమ జవాన్లు మరణించినట్లు గతంలో ధ్రువీకరించలేదు.