కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురు, వైఎస్సార్‌సీపీ విజయభేరి 

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1989 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో టిడిపి పడకవేసింది. అధికారపక్షం కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయభేరి మోగించారు. 
 
మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీలకు పరిమితమయ్యారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
 
 ‘కుప్పం పేరు చెబితే టీడీపీ’ అన్న మాటకు బ్రేక్‌పడింది. చాలా పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.  1985 నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడినుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1989లో చంద్రబాబు తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నికయ్యారు. 
 
తర్వాత వరుసగా ఏడు పర్యాయాలు ఇక్కడ గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు. కుప్పంలో తనకు తిరుగులేదని ఇంతకాలం నిరూపించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తిరగబడింది.
 
కుప్పం మండలంలో 26 పంచాయతీలకు వైసీపీ మద్దతుదారులు 21, టీడీపీ 5.. గుడుపల్లె మండలంలోని 18 పంచాయతీల్లో వైసీపీ 13, టీడీపీ 4, కాంగ్రెస్‌ ఒక పంచాయతీలో.. శాంతిపురం మండలంలో 23 పంచాయతీలకు వైసీపీ 20, టీడీపీ 3 పంచాయతీల్లో..  రామకుప్పం మండలంలో 22 పంచాయతీలకు గాను వైసీపీ 20 పంచాయతీల్లోను, టీడీపీ మద్దతుదారులు 2 పంచాయతీల్లోను గెలుపొందారు.