ఓవైసీ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి మండిపాటు 

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా చేస్తుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదని తేల్చిచెప్పారు. 

హైదరాబాద్‌‌తోపాటు మరికొన్ని చెన్నై, బెంగళూరు, లక్నో నగరాలను భవిష్యత్‌లో కేంద్రం యూటీగా మార్చేస్తుందని ఓవైసీ లోక్‌సభలో పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సహా దేశంలో ఉన్న అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. 

జవాబు చెప్పేలోపే ఓవైసీ పార్లమెంట్ నుంచి పారిపోయాడని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం.. ఎంఐఎం, టీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిన్న పార్లమెంట్‌లో బిజేపీ భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చే ప్రమాదం ఉందని అంటూ ఆరోపణలు చేశారు. లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు  చేశారు. 

పార్లమెంట్‌లో అందరిని రెచ్చగొట్టే విధంగా ఒవైసి వ్యాఖ్యలు చేశారని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ దయ్యబట్టారు. ఎక్కడ, ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.