హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలే లక్షంగా ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్రోడ్డు, 334 కిలోమీటర్ల మేర ) సుమారు రూ 12,000 కోట్ల వ్యయంతో త్వరలో పట్టాలెక్కనుంది. ఈ రింగ్రోడ్డుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సిఎం కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో దీనిపై కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే 80 శాతం భూ సేకరణ సైతం పూర్తయ్యింది. హైదరాబాద్ సహా సమీపంలో ఉన్న పట్టణాల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ను రూపొందించింది. హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ దూర పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధే లక్షంగా ప్రభుత్వం ఆర్ఆర్ఆర్కు రూపకల్పన చేసింది.
హైదరాబాద్ చుట్టూ 50 నుంచి 100 కి.మీ రేడియేషన్ పరిధిలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, జాతీయ రహదారులను కలుపుతూ ఈ ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొత్తంగా మూడేళ్ల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలన్న లక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించడంతో వాహనదారుల నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. రీజనల్ రింగ్ రోడ్డులో కూడా ఆ విధంగానే టోల్ఫీజును వసూలు చేయనున్నట్టుగా తెలిసింది.
కంది, షాద్నగర్లో నాలుగు వరసల రహదారి నిర్మాణం జరుగుతుండగా ఈ పరిధి కూడా ఆర్ఆర్ఆర్ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటివిడతలో 152 కి.మీ. తూప్రాన్ టు గజ్వేల్ నుంచి జగదేవ్పూర్ టు భువనగిరి నుంచి చౌటుప్పల్, రెండోవిడతలో 182 కి.మీ చౌటుప్పల్ టు యాచారం నుంచి కడ్తాల్ టు షాద్నగర్ నుంచి చేవెళ్ల టు శంకర్పల్లి నుంచి కంది వరకు ఈ రింగ్రోడ్డును నిర్మించనున్నారు.
మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 11 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 17 చోట్ల రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులను కలుపుతూ రీజనల్ రింగ్రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్మాణం వలన 12 పట్టణాలు, 125కు పైగా గ్రామాలకు మహర్ధశ పట్టనుంది.
వరంగల్, ముంబై, విజయవాడ, నాగపూర్, బెంగళూరు హైవేలను కలుపుతూ ఈ నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివలన వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లకుండా తమ గమ్యస్థానాలకు వెళ్లేలా ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
మొత్తం రింగ్రోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.12 వేల కోట్లు కాగా అందులో భూ సేకరణకు రూ.3వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లను కేటాయించనున్నట్టుగా తెలిసింది. మొత్తం 334 కి.మీల ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్రోడ్డు) ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించి 6 వరుసలుగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. నగరానికి 50 నుంచి 60 కిలోమీటర్ల వ్యాసార్ధంలో మరో రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక మౌలిక వసతులు ఆరు లేన్లతో ఎక్స్ప్రెస్వే తరహాలో దీనిని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
More Stories
తెలంగాణాలో ఇంటర్ ఫలితాల విడుదల
ఈదురు గాలులకే కుప్పకూలిన వంతెన
దుబ్బాకకు మోదీ నిధులపై రఘునందన్ రావు పుస్తకం