లా కమిషన్ పరిశీలనలో జమిలి ఎన్నికల అంశం

లోక్‌సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో జమిలి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, న్యాయమంత్రిత్వ శాఖకు చెందిన స్థాయీ సంఘం ఎన్నికల సంఘంతో సహా దీనికి సంబంధించిన వివిధ భాగస్వాములతో సంప్రదింపులు జరిపి, తన నివేదికలో కొన్ని సిఫార్సులు చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో తెలియజేశారు. 
 
దేశంలో ఒక దేశం, ఒక ఎన్నికను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా, అలా అయిన పక్షంలో ఈ విషయంలో జరిగిన పురోగతి ఏమిటి? ప్రభుత్వం దీనికి సంబంధించి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాములతో చర్చించిందా? వివరాలు తెలియజేయాలంటూ, తెరాస సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మరికొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయం తెలియజేశారు. 
 
దీనిపై తదుపరి పరిశీలన జరపడానికి, జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ఆచరణాత్మక రోడ్‌మ్యాప్‌ను, నిబంధనావళిని రూపొందించడానికి ఈ విషయాన్ని ప్రస్తుతం లా కమిషన్‌కు నివేదించడం జరిగిందని మంత్రి తన సమాధానంలో తెలియజేశారు.