రూ.48 వేల కోట్లతో 83 తేజస్ ఫైటర్లు  

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వపు భద్రతా వ్యవహారాల కమిటీ రూ 48,000 కోట్ల విలువైన ఈ క్రమ సంబంధిత నిర్ణయానికి ఆమోదం తెలిపే నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి మండలి భేటీలో భాగంగా ఈ కమిటీ సమావేశం అయింది. 

దేశ వాయుసేను బలోపేతం చేసే దిశలో ఈ తేలిక పాటి పోరాట తరహా విమానాలు (ఎల్‌సిఎ) విమానాలను సంతరించుకోవాలని సంకల్పించారు. అత్యాధునిక సాంకేతికత ఈ తేజస్ యుద్ధ విమానాల ప్రత్యేకత. ఖచ్చితంగా ఇది దేశ రక్షణకు కీలక పరిణామం అవుతుందని కమిటీ నిర్ణయం తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో తేజస్ ఫైటర్లతో భారత వాయుసేన పటిష్టం చేయనుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో అంతర్భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. మొత్తం జెట్‌లలో 73 తేజస్ ఎంకె 1 ఎ ఫైటర్ జెట్లు, పది తేజస్ ఎంకె 1 ఎ శిక్షణా సంబంధిత జెట్లు ఉంటాయని మంత్రి వివరించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. 

తేజస్ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ రూపొందిస్తోంది. ఇవి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు అవుతున్నాయని, ఈ క్రమంలో దేశీయ రక్షణ రంగంలో ఇదో మైలురాయి అవుతుందన్నారు. మన దేశ వాయుసేన వీర పైలెట్లకు ఇవి సమర్థవంతపు ఆయుధాలుగా మారుతాయని తెలిపారు.

మూడేళ్ల క్రితమే భారతీయ వైమానిక దళం ఈ తేజస్ ఫైటర్ల సేకరణకు తొలి దశ టెంటర్లు వెలువరించింది. హెచ్‌ఎఎల్ ఈ విమానాల తయారీకి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు నాసిక్, బెంగళూరు డివిజన్లలో అదనపు ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకొంటోందని మంత్రి తెలిపారు. సకాలంలో భారతీయ వాయుదళానికి విమానాలను అందించేందుకు ఈ విధంగా సకల చర్యలు తీసుకుంటున్నారు. 

భారతీయ వైమానిక రంగాన్ని మరింత పటిష్టం ఇదే దశలో స్వయం సమృద్ధిమయం చేయడం లక్షమని తెలిపారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ (సిసిఎస్) ఇప్పుడు అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడంలో ప్రధాని చూపిన చొరవను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తేజస్ ఫైటర్లు ఫ్లైయింగ్ డాగర్స్, ఫ్లైయింగ్ బుల్లెట్లుగా పేరుతుచ్చుకున్నాయి. సులూరులో వీటిని 20వరకూ ఇప్పటికే రూపొందించారు. ఇంతకుముందటి వాటికి ఇప్పటి తేజస్‌కు మధ్య పలు మార్పులు చేశారు. ఇప్పుడు ఇకపై విమానాలు ఆకాశంలోనే ఇంధనం భర్తీ చేసుకుంటాయి. 

సుదూర వీక్షణ సామర్థం ఉంటుంది. శత్రు రాడార్లు, క్షిపణులను దిగ్బంధం చేసే శక్తిని సంతరించుకుంటాయి. మరిన్ని తేజస్‌లను సంతరించుకుంటామని, దేశ వైమానిక స్థావరాల్లోనే వీటి పాటవ సామర్థం, మరమ్మత్తుల ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఆత్మనిర్భర భారత్ నినాదం బలోపేతం అవుతుందని రక్షణ మంత్రి వివరించారు.

మరోవంక, శాస్త్ర సాంకేతిక సహకారం దిశలో భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య బంధం కుదిరింది. దీనికి సంబంధించిన ఎంఒయుకు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. భారత ఎర్త్ సైన్సెస్ , యుఎఇ కి చెందిన జాతీయ మెటియోరాలజీ సంస్థ మధ్య ఈ అవగావహన ఒప్పందం కుదిరింది. దీనితో ఇరుదేశాల మధ్య తూనికలు, భూకంప, సముద్ర జలాల సేవలు అంటే రాడార్లు, శాటిలైట్లు, తరంగాల పరిణామాల లెక్కలు, ఇతర విషయాలపై సాంకేతిక సహకారానికి వీలేర్పడుతుంది.

ఇటువంటి ఎంఒయుతో ఇరు దేశాలు ఎప్పటికప్పుడు సునామీలు, భూకంపాలకు సంబంధించిన విషయాలపై సాంకేతికను వినిమయం తద్వారా ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు హెచ్చరికలకు వీలేర్పడుతుందని అధికారికంగా తెలిపారు.