18న బీజేపీ లోకి మాజీ మంత్రి చంద్రశేఖర్ !

మాజీ మంత్రి, వికారాబాద్‌ మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ ఎ. చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి పంపారు. 
 
పార్టీలో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని, వెన్నుపోటుదారులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. క్రమశిక్షణ కలిగిన తాను  క్రమశిక్షణలేని కాంగ్రెస్‌లో ఇమడలేక పోతున్నానని పేర్కొన్నారు. 
 
కాగా, చంద్రశేఖర్‌ ఈనెల 18న వికారాబాద్‌లో బీజేపీలో చేరనున్నారు. 1985 నుంచి 2008 వరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేశారు.