అర్ధరాత్రి అంధకారంలోకి పాకిస్తాన్ 

శనివారం అర్థరాత్రి విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా యావత్ పాకిస్థాన్ దేశం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా చీకట్లు అలుముకోవడంతో ప్రజలు హాహాకారాలు చేశారు. దేశవ్యాప్తంగా కల్లోలం రేగింది.
 
 విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పాక్ విద్యుత శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాత్ ట్విటర్‌లో తెలిపారు. గుడ్డూ థర్మల్ విద్యుత్ కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సమస్య తలెత్తిందని ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.  
 
 ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విద్యుత్ జెనరేట్లర్ల కోసం బారీ ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారు. అక్కడి పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టారు. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో సహా అన్ని ప్రధాన నగరాలు అంధకారంలో గడిపాయి. 
 
అయితే క్రమంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు, అన్ని ప్రధాన నగరాలలో పునరుద్దరించామని ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ తెలిపారు. ఇక  ఇస్లామాబాద్‌లో పాక్షికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధించారు. అయితే విమానయాన సర్వీసులకు మాత్రం ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నామని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ తెలిపారు.
పాక్‌లో ఇటువంటి విద్యుత్ అంతరాయాలు గతంలోనూ సంభవించాయి.  ముందు జాగ్రత్త కోసం అక్కడి ప్రజల్లో అనేక మంది తమ ఇళ్లలో పెట్రోల్ జెనరేటర్లను ఎల్లవేళలా సిద్ధంగా ఉంచుకుంటారు. ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ఇతర కీలక రంగాల్లోని సంస్థలు కూడా అనేక అత్యవసర ఏర్పాట్లతో నిత్యం అప్రమత్తంగా ఉంటాయి.