రజనీ పార్టీ ప్రారంభం వెనుక  బీజేపీ ప్రమేయం లేదు

రజనీ పార్టీ ప్రారంభం వెనుక  బీజేపీ ప్రమేయం లేదు
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బీజేపీ ఒత్తిడి కారణంగానే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని వస్తున్న పుకార్లను ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ తీవ్రంగా ఖండించారు.
రజనీ పార్టీ ప్రారంభం వెనుక  బీజేపీ ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. రజనీ లాంటి నాయకులు రాజకీయాల్లోకి రావడం మంచిదేనని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలని ఆకాంక్షిస్తున్న ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపానని రాధాకృష్ణన్‌ చెప్పారు. బీజేపీ ఏ పార్టీల వెనుక వుండదని, అన్ని పార్టీలకు ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా,  అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ కొనసాగుతోందని ఆ పార్టీ శాఖ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ స్పష్టం చేశారు. చెన్నైలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలలో పోటీ చేయడం ఖాయమని, ఈసారి అసెంబ్లీలో పార్టీ సభ్యులు తప్పకుండా ఉంటారని చెప్పారు.
అన్నాడీఎంకే కూటమిలో ఎన్ని సీట్లు పొందాలనే విషయంపై బీజేపీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతాయని మురుగన్‌ తెలిపారు. రజనీ రాజకీయప్రవేశంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో డీఎంకే ఘోరపరాజయాన్ని చవిచూడక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, అధికార అన్నాడీఎం ఇప్పటికే బీజేపీతో పొత్తుతో 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఈసారి కూడా కొననసాగనుంది.   ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పెట్టి, లాంఛనంగా ప్రచారానికి  శ్రీకారం చుట్టేశారు. మక్కల్ నీది మయ్యంతో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (ఎంఐఎం) పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.