బీజేపీ గెలవబోతోందనే సీఎం కేసీఆర్ కుట్రలు  

ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోందనే సీఎం కేసీఆర్  కుట్రలు చేస్తున్నారని  మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి  ఆరోపించారు. తనకు సంబంధం లేని ఒక బిజినెస్ లావాదేవీల వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్……తన  పేరును లాగడాన్ని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 
 
దుబ్బాకలో టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతోందని, బీజేపీ గెలవబోతుందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారని, అందుకే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన పైన కూడా వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని ఆయనఆరోపించారు . ఈ విషయంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చిన సీఎం కేసీఆర్ పై పరువు నష్టం దావా వేసేందుకు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. 
దుబ్బాక ఎన్నికల కోసం పోలీసులను వాడుకుని అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ… బీజేపీ గెలుపు ఖాయం అని భరోసా వ్యక్తం చేశారు.  దుబ్బాక ప్రజలు కేసీఆర్ తుగ్లక్ పాలన పట్ల విసుగు చెందారని, వారు తప్పకుండా బీజేపీని గెలిపించబోతున్నారని జోస్యం చెప్పారు. 
 
 నిజంగా దుబ్బాకలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే, దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పై, ప్రగతి భవన్ పై పోలీసులు రెయిడ్ చేయాలని సవాల్ చేశారు. ఓటర్లకు పంచేందుకు డబ్బులన్నీ టీఆర్ఎస్ పార్టీ అక్కడ నుంచే పంపిస్తోందన్నది బహిరంగ రహస్యం అని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.