7న ఇస్రో నుండి ఈ ఏడాది తొలి రాకెట్!

కొవిడ్‌-19తో ఈ ఏడాది ఆగిపోయిన ఇస్రో అంతరిక్ష ప్రయోగాలను నవంబరు 7న తిరిగి ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం ప్రథమ ప్రయోగ వేదిక నుంచి 51వ పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ (పీఎ్‌సఎల్‌వీ సీ-49) ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. 

ఈ రాకెట్‌ ద్వారా 7వ తేదీ మధ్యాహ్నం 3:02 గంటలకు మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం, ఈవోఎస్‌ 1 (ఎక్స్‌ అబ్జర్వేషన్‌ శాట్‌లైట్‌-1)లతో పాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది. 

గతేడాది 5 పీఎ్‌సఎల్‌వీలు, ఒక జీఎ్‌సఎల్‌వీ మార్క్‌-3 (చంద్రయాన్‌-2) రాకెట్‌లను ప్రయోగించిన ఇస్రో 2020లో 15 రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొవిడ్‌-19 ఇస్రో ప్రయోగాలకు కళ్లెం వేసింది. దాంతో స్వదేశం నుంచి ఒక్క రాకెట్‌ను కూడా ఇస్రో ప్రయోగించలేకపోయింది.

జనవరి 17న ప్రెంచ్‌ గయానా నుంచి జీ శాట్‌ 30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టించుకున్న ఇస్రో తదుపరి మార్చి 5న షార్‌ నుంచి జీఎ్‌సఎల్‌వీ ఎఫ్‌-10 రాకెట్‌ ద్వార జీ శాట్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. కానీ ప్రయోగానికి గంట ముందు కేంద్ర నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో అర్ధంతరంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. 

తదుపరి కరోనా విజృంభించడంతో ఇస్రో అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ ఏడాది తొలి రాకెట్‌గా పీఎ్‌సఎల్‌వీ సీ-49ని ప్రయోగించేందుకు షార్‌లో చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొవిడ్‌-19 నిబంధనల కారణంగా ఈ ప్రదేశానికి మీడియాను, సందర్శకులను అనుమతించడం లేదని ఇస్రో ప్రకటించింది. షార్‌లోని విజిటర్స్‌ గ్యాలరీని మూసివేయాలని కూడా నిర్ణయించింది.