పెళ్ళి కోసమే మతం మారడం చెల్లదు 

కేవలం పెళ్ళి చేసుకోవడానికి మాత్రమే మతం మారడం ఆమోదయోగ్యం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసు రక్షణ కోసం నవ దంపతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దంపతుల్లో వధువు జన్మతః ముస్లిం అని, కేవలం పెళ్ళి కోసం మాత్రమే ఓ నెల క్రితం హిందూ మతంలోకి మారారని, ఇది సరికాదని తెలిపింది. 

జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠీ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. జస్టిస్ త్రిపాఠీ ఈ సందర్భంగా ఇదే కోర్టు 2014లో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఆ కేసులో వధువు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకున్నారని తెలిపారు.

ముస్లిం యువకుడు చెప్పిన మీదట హిందూ యువతి ఇస్లాం గురించి ఎటువంటి పరిజ్ఞానం లేకుండా, ఇస్లాం మీద నమ్మకం లేకుండా, కేవలం పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడం చెల్లుతుందా? అని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. వీరు రక్షణ కోసం దాఖలు చేసిన రిట్ పిటిషన్లను తోసిపుచ్చిందని తెలిపారు.

ఓ వ్యక్తి వయసు రీత్యా మేజర్ అయి ఉండి, సక్రమమైన మానసిక స్థితి కలిగియుండి, దైవం ఏకత్వాన్ని, ప్రవక్త మహమ్మద్ గుణశీలాన్ని విశ్వసించి,  తన బుద్ధిపూర్వకంగా ఇస్లాంను స్వీకరించినట్లయితే, ఆ వ్యక్తి ఇస్లాంకు మారడం ప్రామాణికమైనదని చెప్పవచ్చునని హైకోర్టు చెప్పిందని తెలిపారు. 

ఈ సందర్భంగా లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించిందని తెలిపారు. మతపరమైన భావాల ప్రేరణ లేనటువంటి మత మార్పిడి అయితే, దాని కోసమే అటువంటి మత మార్పిడి జరగకపోతే, కేవలం ఓ హక్కును కోరేందుకు ఆధారాన్ని సృష్టించే లక్ష్యంతో, లేదా, వివాహాన్ని తప్పించుకునేందుకు ఓ మార్గంగా ఉపయోగించుకోవడానికి జరిగే మతమార్పిడి చెల్లదని తేల్చి చెప్పిన్నట్లు గుర్తు చేశారు.

అదే విధంగా,  దైవం ఏకత్వంపైనా, మహమ్మద్‌ను తన ప్రవక్తగానూ విశ్వసించకుండా ఏదో లక్ష్యాన్ని సాధించేందుకు అటువంటి మత మార్పిడి జరిగితే, అది ప్రామాణికం కాదని హైకోర్టు తెలిపిందని పేర్కొన్నారు.

మతం మారాలంటే తప్పనిసరిగా మనసు మారాలని, అసలు మతం సిద్ధాంతాలకు బదులుగా కొత్త మతం సిద్ధాంతాలపై నిజాయితీతో కూడిన విశ్వాసం ఉండాలని తెలిపిందని వివరించారు.