లఢక్‌ సరిహద్దులో చైనా భారీ నిర్మాణాలు    

లఢక్‌ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో చైనా కొత్తగా నిర్మాణాలు చేపట్టింది. అలాగే టిబెట్‌లోని ఆక్రమిత అక్సాయ్ చిన్‌తో పాటు జిన్జియాంగ్ ప్రాంతాల్లో ఆయుధాలు, దళాల మోహరింపును మార్చింది. 

ఎల్‌ఏసీకి పది కిలోమీటర్ల దూరంలోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఫుట్‌బాల్‌ కోర్టుల మాదిరిగా 3 లక్షల చదరపు అడుగుల్లో ఉన్న భారీ నిర్మాణాలను గమనించినట్లు ఆర్మీ సినియర్‌ అధికారి తెలిపారు. చైనా దళాలు, ఆయుధాలు, రాకెట్లు, యుద్ధ ట్యాంకులు, తుపాకులు, ఇతర సామగ్రిని శీతాకాలం నుంచి సంరక్షణకు ఈ నిర్మాణాల్లో ఉంచవచ్చని ఆర్మీ మాజీ చీఫ్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. 

శీతాకాలంలోని అక్కడి చల్లని వాతావరణాన్ని తట్టుకోలేక రోగాలబారిన పడే చైనా సైనికులకు వైద్యచికిత్స కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఎల్‌ఏసీకి 82 కిలోమీటర్ల దూరంలోని జిన్జియాంగ్ ప్రాంతంలో కొత్తగా దళాల మోహరింపు, ఆర్మీ వాహనాలు, ఆయుధాలను గుర్తించకుండా మోహరిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 

టిబెట్‌, లఢక్‌లోని డెమ్‌చాక్ ప్రాంతంలో అక్సాయ్ చిన్‌ వెలుపల 92 కిలోమీటర్ల దూరంలో కూడా పీఎల్‌ఏ శిబిరాలు, ఆర్మీ వాహనాల కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. గల్వాన్‌, కొంగ్కా లా ప్రాంతాలపై పీఎల్‌ఏ గట్టి నిఘా ఉంచినట్లు స్పష్టమవుతున్నదని వెల్లడించాయి. 

మరోవైపు అక్సాయ్ చిన్‌కు మరో మార్గంలో దళాలు, ఆయుధాల తరలింపు కోసం భారత్‌, చైనా సరిహద్దుకు 166 కిలోమీటర్ల దూరంలోని జిన్జియాంగ్‌లో హోటాన్, కాన్క్సివార్ మధ్య కొత్త రోడ్డును చైనా నిర్మిస్తున్నది. ఎల్‌ఏసీ వద్ద ఉన్న సైనికులకు అవసరమమ్యే సామగ్రిని హోటాన్‌ ఎయిర్‌ బేస్‌కు వై 20 విమానాల ద్వారా తరలిస్తున్నది. 

లఢక్ సరిహద్దులోనేగాక అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు 60 కిలోమీటర్ల దూరంలో కూడా పీఎల్‌ఏ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. వాయు దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు రష్యాకు చెందిన ఎస్‌-400 క్షిపణులను అక్కడ మోహరించింది. 

తన మోహరింపులను నిఘా శాటిలైట్లు గుర్తించకుండా కౌంటర్‌ స్పేస్‌ జామర్లను చైనా ఏర్పాటు చేసింది. దీంతో 1,597 కిలోమీటర్ల పరిధిలోని లఢక్‌ ఎల్‌ఏసీ ప్రాంతం నుంచి సైనాన్ని శీతాకాలంలో కూడా వెనక్కి మళ్లించే ప్రసక్తే లేదన్న సందేశాన్ని భారత్‌కు పరోక్షంగా చైనా పంపుతున్నది. 

ఒకవైపు చర్చలంటూనే మరోవైపు సరిహద్దులో నిర్మాణాలు, బలగాల మోహరింపుపై చైనా చేస్తున్న కుట్రలను పసిగట్టిన భారత్‌ ఆర్మీ ప్రతిగా చర్యలు ప్రారంభించింది. సరిహద్దులో మరింతగా అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు భారత్‌ వైపు బలగాలు, ఆయుధాల మోహరింపును పెంచుతున్నది.