పాక్ డ్రోన్ ను కూల్చిన భారత సైన్యం 

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఇవాళ పాకిస్తాన్ డ్రోన్ ను భారత భద్రతా దళం సైనికులు కూల్చివేశారు. పాక్ చర్యలను అడ్డుకోవడానికి సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

చలికాలంలో ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తోందని, అందుకే ఈలోగానే ఉగ్రవాదులను సర్రిహద్దు  దాటించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని బి ఎస్ ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్ ను‌ చైనా కంపెనీ డీజేఐ తయారుచేసిందనీ, దాని పేరు మావిక్-2 ప్రో అని చెప్పారు.

ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా తన సహాయ సహకారాలను పాకిస్తాన్ అందిస్తోంది. ఆయుధాలను కూడా డ్రోన్లతో అందిస్తోంది. మరోవైపు మన సైనికులు  కదలికలను కూడా డ్రోన్ల సహకారంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. 

ఈ క్రమంలో ఇప్పటికే పాక్ కు చెందిన పలు డ్రోన్లను మన సైనికులు కూల్చేశారు. తాజాగా  శనివారం ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. నియంత్రణ రేఖ దగ్గర ఏదో కదులుతున్నట్టు గుర్తించిన  మన దళాలు పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ గా గుర్తించి, వెంటనే దాన్ని కూల్చేశారు.

మరోవంక, రాజస్థాన్ లో పాకిస్థాన్ గూఢచారిని అరెస్టు చేశారు. రాజస్థాన్ బాడ్మేర్ లో అదుపులోకి తీసుకున్నట్టు సిబి-సిఐడి అధికారులు వెల్లడించారు. భారత ఆర్మీ సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్టు గుర్తించారు. 

సరిహద్దుల్లో వేతన కార్మికుడిగా పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి విచార‌ణ నిమిత్తం జైపూర్ త‌ర‌లించిన‌ట్లు రాజ‌స్థాన్ పోలీసు ఎడిజి(ఇంటెలిజెన్స్‌) ఉమేశ్ మిశ్రా చెప్పారు.