ఇక ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్‌

వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్‌ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ రమేష్‌ పోఖ్రియాల్‌వెల్లడించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌ను ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు.  2021 నుంచి భారత్‌లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి  ట్వీట్‌ చేశారు.

రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, జేఈఈ మెయిన్స్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. జేఈఈ (మెయిన్స్) ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పించే రాష్ట్రాల స్టేట్ లాంగ్వేజ్‌‌ను కూడా దీనిలో చేర్చుతామని పేర్కొన్నారు. 

పీఐఎస్ఏ పరీక్షలో టాప్ స్కోరింగ్ కంట్రీస్ బోధనా మాధ్యమంగా మాతృ భాషను ఉపయోగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశ్నలను అవగాహన చేసుకుని మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

తాము ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదని, విద్యా బోధనా మాధ్యమంగా మాతృ భాష ఉంటే భారతీయ భాషలు బలోపేతమవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంపైనా ఏదైనా భాషను రుద్దాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఈ భాషలన్నిటినీ ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్‌లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్‌ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు.