ఉల్లిగడ్డల దిగుమతులపై ఆంక్షల సడలింపు

ఉల్లిగడ్డల ధర అనూహ్యంగా పెరగడంతో దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దిగుమతులను వేగంగా దేశీయ మార్కెట్లకు చేర్చడం ద్వారా పెరిగిన ధరలను అదుపులో పెట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. తాజా పరిస్థితిపై వినియోగదారుల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు ఉల్లిగడ్డల దిగుమతులపై సడలింపులు అమలవుతాయని తెలిపింది. ఉల్లిగడ్డలు ఎగుమతి చేసే దేశాలలోని రాయబారులను ఈ విషయమై అప్రమత్తం చేశామని తెలిపింది. ఆయా దేశాల వ్యాపారులతో సంప్రదించాలని సూచించింది.

మరోవైపు ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ చేసిన బఫర్ స్టాక్‌ను కూడా బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపింది. సెప్టెంబర్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు మరింత వేగంగా మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపింది. 

పది రోజుల్లో ఉల్లిగడ్డల ధర దేశీయ సగటు కిలోకు రూ.11.56 నుంచి రూ.51.95కు ఎగబాకినట్టు తెలిపింది. ఖరీఫ్‌లో 37 లక్షల టన్నులు దేశీయంగా ఉత్పత్తి కానున్నట్టు అంచనా ఉన్నది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌లోని ఉల్లిగడ్డలు పండించే ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల నిల్వ, సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయని కేంద్రం తెలిపింది.