వర్షాల బీభత్సంతో హైదరాబాద్లోని చాలా కాలనీలు ఇంకా చీకటిలో మగ్గుతున్నాయి. వారం రోజులైనా విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరింపలేదు. నగరంలోని 166 ట్రాన్స్ ఫార్మర్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో సుమారు 50 వేల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కాలనీలు, వీధుల్లో వరద నీరు ఇంకా ఉండటం, అపార్ట్మెంట్ల సెల్లార్లు నీట మునగడంతో విద్యుత్ సరఫరా అందించలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. హఫీజ్బాబా నగర్లో 20 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, నదీమ్ కాలనీలో 7 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 64 విద్యుత్ స్థంభాలు నేల కూలాయి.
దీనికి తోడు నగర పరిధిలోని అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధుల్లో ఇంకా నీళ్లుండటంతో 139 ట్రాన్స్ఫార్మర్లలో సరఫరాను నిలిపేశామని డిస్కం వర్గాలు చెప్పాయి. వరద ఉధృతి తగ్గగానే విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని చెప్పారు.
మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్లో 189 సెక్షన్ స్థాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు వెల్లడించారు. ఒకొక్క బృందంలో 25 మంది సిబ్బంది ఉంటారు.
కాగా,వర్షాలు ఇంకా పడుతున్నందున విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ ఫార్మర్లను జనం తాకొద్దని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 7382072104, 7382072106,7382071574 కు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు.
More Stories
కాంగ్రెస్ లోకి కేశవరావు, కడియం శ్రీహరి
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు