భారత్‌పై జీహాద్‌కు ఐసిస్ పిలుపు

అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత దేశంపై మరోసారి విషం కక్కుతోంది. భారతీయుల్లోని ఓ సముదాయాన్ని రెచ్చగొడుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని, అందుకు తాము మద్దతిస్తామని చెప్తోంది. 

టెలిగ్రామ్, ఇంటర్నెట్ ద్వారా ప్రచురితమయ్యే ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ అనే డిజిటల్ మ్యాగజైన్ ద్వారా ఈ విషాన్ని వ్యాపింపజేస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఈ మ్యాగజైన్‌పై భద్రతా సంస్థలు నిఘా పెట్టాయి.

ఓ సముదాయాన్ని ఆయుధాలు పట్టాలని రెచ్చగొడుతుండటాన్ని గుర్తించాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని చెప్తుండడాన్ని గమనించాయి.

ఈ మ్యాగజైన్ ప్రచురించిన బాబ్రీ మసీదు ఫొటోపై ‘‘బాబ్రీకి ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని రాసి ఉందని భద్రతా సంస్థలు గుర్తించాయి. సీఏఏపై తప్పుడు కథనాలను ప్రచురించడంతోపాటు, న్యాయస్థానాల తీర్పులకు కట్టబడి ఉండవద్దని ఐసిస్ పిలుపునిచ్చింది.

మరోవంక,  తాజాగా కశ్మీర్‌లో శాంతిభద్రతలను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్ఐ ఇందుకు కోసం ఏకంగా ఇస్లామిక్ స్టేట్ నుంచి స్ఫూర్తి పొందింది. డ్రోన్ల ద్వారా చిన్న చిన్న బాంబు దాడులు చేయడంలో చేయి తిరిగిన ఐఎస్‌ను చూసి కశ్మీర్‌లోనూ ఇదే వ్యూహం అమలు చేయాలని ట్రై చేస్తోంది. 

ఈ విషయమై లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐ గతేడాది ఏప్రిల్‌లోనే ఒకసారి చర్చ జరిపిందని సమాచారం. ఆ మరుసటి నెలలో రెండో సమావేశం కూడా జరిగిందని తెలుస్తోంది.

డ్రోన్ల ద్వారా 5 కేజీల పేలుడు పదార్థాలు కశ్మీర్‌లో జారవిడచాలని ఉగ్రవాదులకు సూచించిందట. ఈ దిశగా వారికి తర్ఫీదు ఇవ్వడం కూడా ప్రారంభించినట్టు సమాచారం. తక్కువ ధరకు దొరికే చీప్ డ్రోన్లను ఇందుకు వినియోగించాలని ఈ ముష్కరమూకలు నిర్ణయించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

కాగా..ఈ వ్యూహాన్ని వినియోగించి ఇస్లామిక్ స్టేట్ మొదట్లో అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తూ అద్భుత విజయాలు సాధించింది. అమెరికా మిలటరీ వర్గాలు ఈ రకమైన డ్రోన్లను క్లిలర్ బీస్(తేనెటీగలు)గా సంబోధించేవి.

ఈ వ్యూహాన్ని నిలువరించేందుకు అమెరికాతో పాటు,  డ్రోన్ల తయారీ సంస్థలు వెల కోట్ల డాలర్ల నిధులు వెచ్చించి పెద్ద ఎత్తున పరిశోధన చేపట్టాయి. డ్రోన్లలో మార్పులు చేశాయి. తదనంతర కాలంలో అమెరికా ముప్పేట దాడికి ఐఎస్ నెలకొరిగింది.