రాహుల్ ఇక నుంచి రాహుల్ లాహోరి

“లాహోర్ లిటరరీ ఫెస్ట్” వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భారత ప్రభుత్వంపై చేసిన విమర్శలపై బీజేపీ మండిపడింది. కోవిడ్ విషయంలో భారత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని, ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారత పౌరులపై వివక్ష కొనసాగుతోందని థరూర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టింది. 
 
రాహుల్ గాంధీని ఇక నుంచి రాహుల్ లాహోరి అని పిలుచుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.  అంతర్జాతీయ వేదికలపై భారత దేశం ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే రాహుల్ ‌గాంధీ పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. 
 
‘మీరు పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? దయచేసి స్పందించండి’ అని పాత్ర ప్రశ్నించారు. ఇక నుంచి రాహుల్‌ను రాహుల్ లాహోరి అని బీజేపీ పిలుస్తుందని, తాను కూడా ఆవిధంగానే పిలుస్తానని ఆయనస్పష్టం చేశారు. రాహుల్ డెబట్ ర్యాలీని పాకిస్థాన్‌లో థరూర్ ప్రారంభించారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
యావత్ ప్రపంచం  ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం పురోగమిస్తుండటం చూస్తోందని, కరోనా రోగుల రికవరీ రేటు గరిష్టంగా, మరణాల రేటు కనిష్టంగా ఉండటం మనమంతా చూశామని సంబత్ పాత్ర పేర్కొన్నారు. 
 
ముస్లిం వర్గంపై బహిరంగంగా వివక్షను చూపడానికి కేంద్రం తబ్లిగీ జమాతే కార్యక్రమాన్ని ఉపయోగించుకుందని శశిథరూర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. పాకిస్థాన్‌లో మైనారిటీల పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు అనుచితంగా రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీకి అనిపించడం లేదా అని ఆయన నిలదీశారు.