న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి 

ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు గొప్ప బలమని  చెబుతూ న్యాయమూర్తులు విలువలకు కట్టుబడి నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఆర్‌ లక్ష్మణన్‌ స్మారక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మకం, విశ్వాసం, ఆమోదయోగ్యత అనేవి ఆధిపత్యంతో రావని, స్వయంగా సంపాదించుకోవాలని తెలిపారు.
‘మన విలువలే మనకు గొప్ప సంపద. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు. ఉత్తమంగా జీవించాలంటే లెక్కలేనన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలి. వినయం, సహనం, దయాగుణం, కార్యదక్షత అనేవి వ్యక్తిని ఉన్నతుడిగా మారుస్తాయి. ముఖ్యంగా న్యాయమూర్తులు వారు నమ్మిన సిద్ధాంతాలపై స్థిరంగా నిలబడాలి’ అని ఆయన పేర్కొన్నారు.
నిర్ణయాలు తీసుకోవటంలో అన్నిరకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడటం న్యాయమూర్తులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం అని చెప్పారు. `ఇక్కడ ఓ మునిపుంగవుడు శ్రీరాముడి గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. రాముడు తన జీవితంలో సాధించిన విజయాల వల్ల గొప్పవాడు కాలేదు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా ఆయన చూపిన దయాగుణం వల్లనే మహాపురుషుడు అయ్యాడు’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
`నీకు ఎంత (సంపద) ఉన్నది అన్నది విషయం కాదు. నువ్వు ఏం చేశావన్నది కూడా ముఖ్యంకాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నడవడిక ఎలా ఉందన్నదే ముఖ్యం’ అని త్లెఇపారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసిన జస్టిస్‌ లక్ష్మణన్‌ ఈ ఏడాది ఆగస్టు 27న మరణించారు. ఆయన ప్రముఖ న్యాయ కోవిదుడిగా గుర్తింపు పొందారు.