పిటిఐ వార్తలకు ప్రసార భారతి విముఖత 

దేశంలోనే ప్రముఖ వార్తా సంస్ధ అయిన ప్రెస్‌ ట్రస్టు ఆఫ్‌ ఇండియా (పిటిఐ)నుంచి వార్తలు తీసుకునే ఒప్పందం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ప్రసార భారతి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

ఇది పూర్తిగా వాణిజ్యపరమైన నిర్ణయమని ప్రసారభారతి అధికారులు చెబుతున్నప్పటికీ, వార్తలకు సంబంధించి వచ్చిన విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రచారం జరుగుతోంది. పిటిఐతో వార్షిక సభ్యత్వ విషయంలో విభేదాల అనంతరం ప్రసార భారతి మరో వార్తా సంస్థ యునైటైడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా (యుఎన్‌ఐ)పై కూడా వేటు వేసింది. 

కాగా, ఆసియా న్యూస్‌ ఇంటర్నేషనల్‌(ఎఎన్‌ఐ), హిందుస్ధాన్‌ సమాచార్‌లను అధికారిక ఏజెన్సీలుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

సరిహద్దుల్లో భారత్ – చైనాల మధ్య ఘర్షణలు జరుగుతూ, 20 మంది భారత సైనికులు వీరమరణం పొంది, ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో భారత్ లో చైనా తరపున రాయబారిగా ఉన్న సన్‌ వీడంగ్‌, బీజింగ్‌లో భారత రాయబారి విక్రం మిస్రిలతో పిటిఐ ఇంటర్వ్యూలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. పిటిఐ వ్యవహారంపై దేశంలో దుమారం చెలరేగింది.

ఆ ఇంటర్వ్యూ లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు భారత్ వైఖరియే కారణం అంటూ చైనా రాయబారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ భూభాగంలో భారత్ వ్యతిరేక ప్రచారం చేయడానికి చైనా రాయబారి పిటిఐ అవకాశం ఇవ్వడం భారతీయులలో ఆగ్రవేశాలకు దారితీసింది. 

1980 నుండి ప్రభుత్వం నుండి పిటిఐ సుమారు రూ 200 కోట్ల నిధలు పొందగా, వార్తలు ఇవ్వడంలో ఎటువంటి జవాబుదారీతనం పాటించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా, ప్రభుత్వంతో సరైన ఒప్పందం లేకూండానే ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైనది. చివరి ఒప్పందం 2005లో చేసుకోగా, 2006లో ముగిసింది. ఆ తర్వాత ఎటువంటి ఒప్పందం లేకుండానే ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రాతిపదికపై ప్రభుత్వం నుండి నిధులు పొందుతున్నది.