భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో సారి నోరు పారేసుకున్నారు. భారత్  మిత్ర దేశం ఆంటోనీ అప్పుడప్పుడు భారత్ పై తన అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు.  భారత్‌ను చైనా, రష్యాలతో చేర్చివాయుకాలుష్యం పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు దేశాలే ప్రధాన కారణమవుతున్నాయంటూ ఆరోపించారు.

తమ దేశం ఈ విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు గొప్పలు చెప్పుకున్నారు. ట్రంప్ గతంలో కూడా చాలా సార్లు ఇదే విధమైన ఆరోపణలు చేశారు. కీలక పోరు సాగే ఉత్తర కరోలినా రాష్ట్రంలో వేలాది మంది అభిమానులనుద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ అమెరికా తన పరిపాలనలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి సాధించిందని ప్రకటించారు.

పర్యావరణ గణాంకాల విషయంలో తామే అత్యుత్తమమని చెబుతూ చైనా, రష్యా, భారత్‌లాంటి దేశాలు హానికర పదార్థాలను విపరీతంగా విడుదల చేస్తూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌కు బదులు కాగితాన్ని వాడాలన్న ఆలోచననను ఆయన ఎద్దేవా చేయడం గమనార్హం. 

తాను అధ్యక్షుడైతే కోటిమందికి పైగా వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తామని ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో బైడెన్ వలస విధానం అమెరికా సరిహద్దులనే చెరిపేసే విధంగా ఉందని ట్రంప్ విమర్శించారు.