వచ్చే ఏడాది భారత్ వేగంగా వృద్ధి

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020-21) భారత ఆర్థిక వ్యవస్థ మైనస్ 10.3 శాతానికి క్షీణించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతంలో 4.5 శాతం క్షీణత అంచనా వేయగా, ఇప్పుడు మరింతగా అంచనా పెంచింది. 
 
మూడు రోజుల క్రితం ఆర్‌బిఐ మైనస్‌ 9.5శాతం మేర వృద్ధి పతనం ఉంటుందని పేర్కొనగా, అంతకు కొద్దిరోజుల ముందు ప్రపంచబ్యాంకు మైనస్‌ 9.6 శాతం మేర జిడిపి పతనమవుతుందని అంచనా వేసింది. 
 
అదే సమయంలో ఐఎంఎఫ్ ప్రకారం, 2021-22లో భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 8.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. దీంతో చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ సామర్థం పెంచుకోనుంది. 
 
అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4.4 శాతం పతనం కానుందని తెలిపింది. అంతకుముందు 5.2 శాతం ప్రపంచ వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. 2020లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో మైనస్ 5.8 శాతం క్షీణత అంచనా వేసింది. అదే సమయంలో, వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థను 3.9 శాతం పెరగొచ్చని తెలిపింది.