కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూత  

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు (64) కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఇంటిలో జారి పడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. అప్పటి నుండి ఆమె ఆర్ధో న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నారు. 

ఈ క్రమంలో ఆమె కరోనా బారిన పడ్డారు. పది రోజులుగా హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

తెలుగు రాష్ట్రా‌ల్లోనే కాకుండా దేశ, విదే‌శాల్లో తన నృత్య ప్రద‌ర్శ‌న‌లతో కూచిపూడి నాట్య కళాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె..12 ఏండ్ల వ‌య‌స్సులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు.

స‌త్య‌భామ‌, ప‌ద్మావ‌తి పాత్ర‌ల్లో ఆమె రాణించారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. నాట్య ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలెన్నో గెలుచుకున్నారు.

2001లో ఆమె పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్ పుర‌స్కారం, 1991లో సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డు, 19821లో నిత్య చూడామ‌ణి పుర‌స్కారం అందుకున్నారు.    ఆమె భర్త ప్రముఖ రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి అర్జునరావు.