రెండు గంటలకుపైగా స్తంభిచిన ముంబై 

అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో దేశ ఆర్ధిక రాజధాని ముంబై సోమవారం రెండు గంటలకు పైగా స్తంభించి పోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మెట్రో, సబర్బన్, లోకల్ రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నళ్లు ఆఫ్ అయిపోయాయి. ఆస్పత్రులు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.  ప్రజాజీవనం తలాకుతలమైపోయింది. 
 
ఇండ్లలోని జనం వేడికి తట్టుకోలేక విలవిల్లాడారు. సాంకేతిక సమస్య వల్లే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మహారాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ చెప్పారు. మధ్యాహ్నం 12 తర్వాత సరఫరాను ప్రాంతాల వారీగా చేపట్టారు. అయితే సాయంత్రానికి కూడా చాలాచోట్ల పూర్తిగా విద్యుత్  సరఫరా ప్రారంభం కాలేదు. 2018 జూన్ లో కూడా ఇలానే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

విద్యుత్తో కొరతతో ఉదయం 10.05 నిమిషాలకు పశ్చిమ, మధ్య రైల్వేలో రైళ్లు ఆగిపోయాయి. తర్వాత చాలాచోట్ల విద్యుత్ సరఫరా  నిలిచింది. కొలబా, మాహిమ్, బాంద్రా, అంధేరి, కాందివలి, భాండూప్ తదితర ప్రాంతాల్లో చాలాసేపు విద్యుత్ సరఫరా వస్తూ పోతూ సతాయించింది. థానే, పాల్ఘడ్‌‌, రాయ్‌‌గఢ్‌‌ జిల్లాల్లోను విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తర్వాత మధ్యరైల్వే హార్బర్ లైన్ నుంచి 10.55కి రైళ్ల సేవలు నెమ్మదిగా మొదలయ్యాయి. తొలుత అత్యవసర సేవల్లో పాల్గొనే వర్కర్లను ట్రైన్లు గమ్యస్థానాలకు చేర్చాయి. మధ్యాహ్నం 12కు విద్యుత్ సరఫరాను ప్రాంతాల వారీగా పునరుద్ధరించారు.

కరోనా రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో ఎక్కడా విద్యుత్  సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకున్నారు. మిగతా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, ఇతర సేవల్లో సమస్యలు తలెత్తకుండా 8 గంటలపాటు నడిచేలా డీజిల్ సరఫరా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్ ఆదేశించారు. ఎయిర్ పోర్ట్​లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.

టాటా పవర్ ప్లాంటులో గ్రిడ్ ఫెయిల్యూర్ వల్లే విద్యుత్ సరఫరా ఆగోపాయిన్నట్లు బృహన్​ముంబై ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్ పోర్ట్(బెస్ట్) చెప్పింది. ‘మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్​మిషన్ కంపెనీ (ఎంఎస్ఈటీసీఎల్)కి చెందిన సదుపాయాలలో సమస్య తలెత్తిందని రాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ తెలిపారు.

‘‘ఎంఎస్ఈటీసీఎల్ కు చెందిన 400 కేవీ కల్వా–పడ్ఘా లైన్​లో మెయింటెనెన్స్ వర్క్ నడుస్తోంది. ఈ సమయంలో సర్క్యూట్ నంబర్ 2లో టెక్నికల్ లోపం తలెత్తింది. దీంతో మొత్తం లోడ్ సర్క్యూట్ నంబర్ 1పై పడింది. ఇది షట్ డౌన్​కు దారితీసింది” అని చెప్పారు.

మహారాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి చేసే స్టేషన్ల నుంచి కల్వా సబ్‌‌స్టేషన్ వరకు విద్యుత్ను తీసుకువచ్చే బాధ్యత ఎంఎస్‌‌ఈటీసీఎల్ ది. ఇక్కడి నుంచి టాటా పవర్, అదానీ ఎలక్ట్రిసిటీ వంటి ప్రైవేటు పంపిణీ సంస్థలు వినియోగదారులకు కరెంటు సరఫరా చేస్తాయి.

విద్యుత్ సరఫరా ఆగిపోవడంపై విచారణ చేపట్టాలని అధికారులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. విద్యుత్ మంత్రి రౌత్, ముంబై మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్ లతో మాట్లాడి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.