దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఎదురీత…. సానుభూతి ఫలిస్తుందా! 

టీఆర్‌ఎస్‌ కు ప్రతిష్టాకరమైన దుబ్బాక ఉపఎన్నికలో సానుభూతి ఏ మేరకు ఫలిస్తుందనే అనుమానాలు అధికార పక్షంలో తలెత్తుతున్నాయి. ప్రతి ఎన్నికలో సర్వేలు చేయుంచుకొనే,  తమదే గెలుపుని ప్రకటించుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ పర్యాయం సర్వేల సంగతి ప్రస్తావించక పోవడం గమనార్హం.
 టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 3న జరిగే ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలైన అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ గెలుపే లక్క్ష్యంగా బరిలో నిలిచాయి.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డిని నాలుగు సార్లు గెలిపించినా చుట్టుపక్కల ఉన్న సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట లాంటి నియోజకవర్గాలతో పోల్చుకొంటే దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అసంతృప్తి స్థానిక ప్రజలలో కనిపిస్తున్నది.
గతంలో కాంగ్రెస్‌ (చెరుకు ముత్యంరెడ్డి) ఇక్కడ బలమైన నేతగా పేరొందినా ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం బీజేపీ ఆక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ నుంచి కంటే బీజేపీ నుంచే తీవ్రమైన పోటీ ఎదురవుతున్నది.
బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్‌ గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముచ్చటగా మూడోసారి బరిలోకిదిగి ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో  ప్రచారంలో ఇరు పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు.  ఓటమి చెందిన ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్న ఆయన పట్ల సానుభూతి కనిపిస్తున్నది.
 
స్థానికతతో పాటు, సానుభూతి కూడా తోడవుతుంది భావించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్‌ఎస్సుజాతను బరిలోకి దింపారు.  అయితే తెలంగాణలో పలు ఉపఎన్నికలలో సానుభూతి రాష్ట్రం పనిచేయడం లేదు. దానితో అధికార పక్షంలో ఖంగారు కనిపిస్తున్నది. 
ఉమ్మడి మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందగా కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్‌ బరిలో నిలపగా ఆయనపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది.
 
అట్లాగే, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా, కాంగ్రెస్ అక్కడ కూడా ఆయన  భార్య సుచరితా రెడ్డిని నిలబెట్టింది. కానీ  2016లో ఉప ఎన్నికలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 
 
 ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే తమకు ఓటమి తప్పదని అధికార టీఆర్‌ఎస్ నేతలలో భయం పట్టుకొంది. అందుకే ఆర్ధిక మంత్రి హరీష్ రావు గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు.