ఈవ్‌టీజర్స్‌ కట్టడికి యుపిలో ‘షేర్నీస్క్వాడ్‌’

ఈవ్‌టీజర్స్‌ ఆటకట్టించేందుకు, సామాజిక వ్యతిరేక అంశాల వేధింపుల సమస్యను ఎదుర్కోవడానికి ‘షేర్నీస్క్వాడ్‌’ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రారంభించారు. మాల్స్, మార్కెట్లు, మతపరమైన ప్రదేశాలు వంటి బహిరంగ ప్రదేశాలలో ఈ బృందం సభ్యులను మోహరించనున్నారు. 
 
ఈ బృందం ప్రతి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిఘా ఉంచుతుంది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని నిబంధనల గురించి ఈ ‘షేర్నీస్క్వాడ్‌’కు శిక్షణ ఇచ్చారు. 
 
అదేవిధంగా రౌడీలను ఎదుర్కొనేందుకు వీరికి శారీరక దృఢత్వ శిక్షణ కూడా అందించినట్లు ఎస్‌ఎస్‌పీ జోగేంద్రకుమార్‌ తెలిపారు. సున్నితమైన ప్రదేశాలలో వీరు విధుల్లో ఉండి సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా ఉంచుతారని చెప్పారు. 
 
తొలుత ఈ షేర్నీ స్క్వాడ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘోరక్‌పూర్‌ నుంచి ప్రారంభించేందుకు కసరత్తు చేశారు. ఇక్కడ విజయవంతం అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు నోడల్ అధికారి సుమన్‌ కుమార్‌ చెప్పారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి వెలుగులోకి వచ్చిన తర్వాత, భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా షేర్నీ స్క్వాడ్స్‌ను తీసుకువచ్చారు.