బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత కుష్బూ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటి ఖుష్బూ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్‌‌‌తోపాటు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సమక్షంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఖుష్బూ పార్టీలో చేరారు

ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఖుష్బూ పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ గత రాత్రి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని ఖుష్బూ ఆమె చెప్పారు. 

‘దేశాన్ని సరైన దారిలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని మోదీ  లాంటి నాయకుడి అవసరం ఉందని గ్రహించా. కాంగ్రెస్‌‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అకారణంగా బీజేపీ విధానాలను వ్యతిరేకించాం. అక్కడ నా సేవలను అంతగా వినియోగించుకోవడం లేదని అనిపించింది. బీజేపీలో ఏ బాధ్యతలు అప్పగించినా కష్టపడి పని చేస్తా’ అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. 

దేశంలోని 128 కోట్ల మంది ప్ర‌జ‌లు ఓకే వ్య‌క్తిని న‌మ్ముతున్నార‌ని, ఆయనే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అని కుష్బూ పేర్కొన్నారు. బీజేపీ స‌ర్కారు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏదో ఒక‌టి చేస్తూనే ఉంటుంద‌ని మాత్రం క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని ఆమె భరోసా వ్యక్తం చేశారు. పార్టీ వ్య‌క్తిగ‌తంగా త‌న కోసం ఏం చేస్తుంద‌నే దానికంటే, ప్ర‌జ‌ల కోసం ఏం చేస్తుంద‌న్న‌దే ముఖ్య‌మని కుష్బూ వ్యాఖ్యానించారు. ‌ ‌

ప్రధాని మోదీ దేశాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెబుతూ తమిళనాడులో మరో కొద్దీ నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం శ్రమిస్తానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 

“కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడానో సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో చెప్పా. కాంగ్రెస్ అక్కడ ఏ రోజూ విజయం కోసం పని చేయలేదు. నేను టికెట్ కోసం ఎప్పుడూ అడగలేదు. ఆ పార్టీని వీడటానికి అది కారణం కాదు. కాంగ్రెస్ నేతలకు నాతో ఈగో సమస్యలు ఉన్నాయనుకుంటున్నా” అని ఆమె ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న‌త స్థాయిలో ఉన్న కొంద‌రు  క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలియ‌కుండానే ఆదేశాలు ఇస్తున్నార‌ని, ఇది న‌చ్చ‌క‌నే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ఖుష్బూ త‌న  రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.  2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

గ‌తంలో ఆమె డీఎంకేలో కూడా చేరారు.  2010లో డీఎంకే అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఖుష్బూ ఆ పార్టీకి ప‌నిచేశారు.   ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు ఆ పార్టీని వీడిన ఖుష్బూ.. సోనియా గాంధీతో భేటీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది.

త‌మిళ న‌టి కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేర‌డాన్ని త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ స్వాగ‌తించింది. త‌మ మిత్ర‌ప‌క్షమైన‌ బీజేపీలో చేర‌డం ద్వారా కుష్బూ సుంద‌ర్ మంచిప‌ని చేశార‌ని, ఇది చాలా సంతోష‌క‌ర‌మైన ప‌రిణామ‌మ‌ని అన్నాడీఎంకే సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌త్స్య‌శాఖ మంత్రి డీ జ‌య‌కుమార్ పేర్కొన్నారు. కుష్బూకు అన్నాడీఎంకే పార్టీ త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెల‌య‌జేశారు.