హిమాచల్‌ ప్రదేశ్‌ సిఎం జైరాం ఠాకూర్‌కు కరోనా  

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి  జైరాం ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన సోమవారం పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సిఎం జైరాం ఠాకూర్ ట్వీట్ చేశారు. 

వైద్యుల సూచనల మేరకు తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఇటీవల జైరాం ఠాకూర్‌ను కలిశాడు. దీంతో వారం రోజులుగా సిఎం హోంక్వారంటైన్ లో ఉంటున్నారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే చికిత్స చేయించుకోవాలని జైరాం ఠాకూర్‌ కోరారు. 

ప్రజలు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉంటేనే బహిరంగ ప్రదేశాల్లోకి రావాని, బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు విదిగా మాస్కులు దరించాలని ఆయన ప్రజలను కోరారు.  

కాగా, కరోనా మహమ్మారి వ్యాధితో చికిత్స పొందుతున్న  బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కన్నుమూశారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస తీసుకున్నారు.  రేపు (అక్టోబర్ 13 న) ఆయన మృతదేహాన్ని పాట్నాకు తరలించనున్నారు.  

మంత్రి వినోద్ సింగ్‌‌ జూన్‌ 28న కోవిడ్ బారినపడ్డారు. మంత్రితోపాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో కతియార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందజేశారు.  అయితే కరోనా నుంచి  ఇద్దరూ కోలుకున్నప్పటికీ, మంత్రికి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం పట్నానుంచి ఆగస్టు 16న ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు.

మరోవంక, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ శరత్ కుమార్ కర్ కరోనా వల్ల కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందించారు.