మహిళలపై నేరాలలో తప్పనిసరిగ్గా ఎఫ్ఐఆర్ 

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల కేసుల్లో త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.  రేప్ లాంటి కేసుల్లో కేవ‌లం రెండు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాల‌ని ఆదేశించింది. అత్యాచార బాధితుల‌కు 24 గంట‌ల్లోనే మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ వైద్య‌ ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించింది.

ఒక‌వేళ పోలీసులు వెంట‌నే స్పందించ‌లేని ప‌క్షంలో అప్పుడు నేర‌స్థుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అవుతుంద‌ని, దాని ప‌రిణామాలు విప‌రీతంగా ఉంటాయ‌ని కేంద్రం త‌న అడ్వైజ‌రీలో హెచ్చరించింది.

మహిళలపై నేరాలకు సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది. యూపీలోని హాథ్రస్ ఘటన తర్వాత మహిళల భద్రతపై రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం తాజా ఆదేశాలు జారీ చేసింది. 

మహిళలపై నేరాలు జరిగినపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ) లోని సెక్షన్ 154 లోని సబ్ సెక్షన్ (1) కింద గుర్తించదగిన నేరం జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.   

మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్, పోలీసుస్టేషను పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. మహిళల నేరాలకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదులో విఫలమైతే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రహోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది.

మహిళల నేరాలపై ఇండియన్ పీనల్ కోడ్ 1860 (ఐపీసీ) లోని సెక్షన్ 166 ఎ (సి) సెక్షన్ 326 ఎ, సెక్షన్ 326 బి, సెక్షన్ 354, సెక్షన్ 354 బి, సెక్షన్ 370, సెక్షన్ 370 ఎ, సెక్షన్ 376, సెక్షన్ 376 ఎ, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 సి, సెక్షన్ 376 డి, సెక్షన్ 376 డిఎ, సెక్షన్ 376 డిబి, సెక్షన్ 376 ఇ లేదా ఐపిసిలోని సెక్షన్ 509ల ప్రకారం కేసులు పెట్టాలని కేంద్రం సూచించింది.