దివాళా అంచున కేసీఆర్ ప్రభుత్వం

తమది సంపన్న రాష్ట్రంగా, మిగులు వనరులున్న రాష్ట్రంగా చెప్పుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉద్యోగులకు క్రమంగా జీతాలు ఇవ్వడంలో సహితం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి నెల 1వ తేదీకల్లా ఉద్యోగుల జీతాలు ఇవ్వవలసిన ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో మాత్రం 10 రోజుల వరకు ఆలస్యంగా అకౌంట్లలో పడుతున్నాయి.

పైకి సాంకేతిక సమస్య అని చెబుతున్నప్పటికీ ఖజానా ఖాళీ కావడమే అసలు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా తొలినాళ్లలో రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గిపోవడంతో మూడు నెలలు జీతంలో కోత విధించిన విషయం తెలిసిందే. కిందటేడాదితో పోలిస్తే పన్నులు, పన్నుయేతర రెవెన్యూ​ బాగా తగ్గింది. అందుకే జీతమివ్వడంలో జాప్యం చేస్తున్నారని తెలిసింది

ఈ నెల జీతం హైదరాబాద్​ జిల్లాకు చెందిన కొందరికే ఫస్ట్​ తారీఖున పడగా, మిగతా వారికి రోజుకు కొన్ని జిల్లాల చొప్పున ఇప్పటికీ జమ అవుతున్నాయి. 10వ తేదీ వరకు జీతాలు పడడం కొనసాగుతుందని ట్రెజరీ అధికారి ఒకరు వెల్లడించారు

ఫస్ట్​కు జీతం వస్తుందనే నమ్మకంతో చాలా మంది తమ ఇల్లు, కారు, ఇతర లోన్లను 5వ తేదీలోగా కట్ అయ్యేలా ఈఎంఐ పెట్టకున్నామని, కానీ ఆ తేదీ నాటికి జీతం పడకపోవడంతో జరిమానా చెల్లించే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇక, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీళ్లకు 15 నుంచి 20 రోజులు ఆలస్యంగా జీతాలిస్తున్నారు. దీంతో 2 లక్షల మంది ఉద్యోగులకు ప్రతి నెలా ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లోని టీచర్లకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా అందలేదు.

జీపీఎఫ్ సొమ్ము నుంచి మంజూరు చేయించుకున్న రుణాలు, పాక్షిక ఉపసంహరణలు, రిటైర్డ్ అయిన, మరణించిన ఉద్యోగుల తుది వేతనాలూ పొందేందుకూ నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.