ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు  

ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ కొత్తనాటకాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రహస్యం లేకపోతే ప్రాజెక్టుల డిపిఆర్  లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.   

ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమీ మాట్లాడలేదని ఆమె ఆరోపించారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునే ఇంతవరకు పూర్తి చేయలేదని ధ్వజమెతాయారు. అసలు ఆ ప్రాజెక్టును నిర్మించాలని ఆయనకు లేదని దుయ్యబట్టారు. 

పాలమూరు, రంగారెడ్డి ప్రజలపైన కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. దొంగలు దొంగలు కలిసినట్టు కాంట్రాక్టర్లతో జతకట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని అరుణ పేర్కొన్నారు. 30000 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లపైగా వ్యయం పెంచారని గుర్తు చేశారు.

ఇలా ప్రాజెక్టుల వ్యయం పెంచుకుంటూ..అప్పులు తెచ్చి మరీ కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుంటూ…కేంద్ర ప్రభుత్వంపై పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని అరుణ మండిపడ్డారు.

మరోవంక, అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ సీఎం జగన్ మాట్లాడిన అంశాల్లో తప్పేం లేదని అరుణ స్పష్టం చేశారు. ‘అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జలవివాదానికి పరిష్కారం తీసుకొస్తారని భావించాం. ప్రాజెక్టులపై అభ్యంతరాలను కేసీఆర్ సరిగా వ్యక్త పర్చలేదు. అడ్డగోలుగా ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. పాలమూరు ప్రాజెక్టుకు న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ వ్యవహరించలేదు’ అని ఆమె విమర్శించారు.