తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ : బిజెపి 

త‌న ఫోన్లు, త‌న సిబ్బంది ఫోన్ల‌ను తెలంగాణ స‌ర్కారు ట్యాపింగ్ చేస్తుందంటూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు దుబ్బాక బీజేపీ అభ్య‌ర్ధి రఘునంద‌న్ రావు ఫిర్యాదు చేశారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆర్ధిక మంత్రి టి. హరీశ్ రావుల  ఆదేశాల మేర‌కు తెలంగాణ పోలీసు విభాగం ఈ ట్యాపింగ్ చేస్తున్న‌ద‌ని పేర్కొంటూ వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 

అక్టోబ‌ర్ 5 న జ‌రిగిన‌ సంఘ‌ట‌న ద్వారా ఇది రుజువ‌య్యింద‌ని చెబుతూ వెంట‌నే ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచార‌ణ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.  

ఇలా ఉండగా, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన దుబ్బాక బీజేపీ నాయకుడు తోట కమలాకరరెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సస్పెండ్ చేశారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కమలాకరరెడ్డి తీవ్ర విమర్శలు చేయడాన్ని పార్టీ నాయకత్వం తీవ్ర అంశంగా పరిగణించింది. దీంతో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని కమలాకరరెడ్డిపై బీజేపీ వేటు వేసింది.