తిరిగి శ్వేత సౌధానికి చేరుకున్న ట్రంప్ 

కరోనా మహమ్మారితో మిలటరీ హాస్పిటల్‌లో చేరిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శ్వేత సౌధానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు ఆయనకు వైద్యులు చికిత్స అందించనున్నారు. 
 
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న భార్య మిలానియా ట్రంప్‌ల‌కు క‌రోనా వైర‌స్ సంక్రమించింది. దీంతో వారు వైట్‌హౌస్‌లో క్వారంటైన్‌లో ఉండగా.. వైద్యుల సూచన మేరకు వాల్టర్‌ రీడ్‌ సైనిక హాస్పిటల్‌లో చేరారు. నాలుగు రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్న ట్రంప్‌కు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో అధికారులు స్టెరాయిడ్స్‌ ఇచ్చారు.
 
హాస్పిటల్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్‌హౌజ్‌కు చేరుకున్న ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌లో రిపోర్టకు అభివాదం చేస్తూ థమ్సప్‌ సింబల్ చూపుతూ తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. అనంతరం మాస్కు తొలగించి ఫొటోలకు ఫోజులిచ్చారు.
 
 కాగా డిశ్చార్జ్‌ కావడానికి ముందు అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్‌ కారులో కలియదిరిగారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు
 
అలాగే రెజెనెరాన్స్‌కు చెందిన 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఇచ్చారు. అలాగే జింక్‌, విటమిన్‌ ‘డీ’, ఫామోనిటిడైన్‌, ఆస్పిరిన్‌, మెలటోనిన్‌ తీసుకున్నారు. పాలీక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉండడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా ట్రంప్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అవుతున్నట్లు ట్వీట్‌ చేశారు. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కొవిడ్‌ గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు. మన జీవితాల్లో వైరస్‌ అధిపత్యం ప్రదర్శించకుండా అమెరికన్లు చూసుకోవాలని సూచించారు. మహమ్మారి నియంత్రణకు అవసరమైన ఔషదాలు అందుబాటులో ఉన్నాయని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.