బీఎస్ గడువు నుంచి ట్రాక్టర్లకు మినహాయింపు  

కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించేనిర్ణయం తీసుకున్నది. బీఎస్ నిబంధనల అమలు గడువు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కొత్త నిబంధనల‌ను వచ్చే ఏడాదికి  వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ట్రాక్టర్లకు కొత్త బీఎస్ రూల్స్ వర్తించవు.

నిర్మాణ పరికరాల వాహనాలకు కొత్త ఉద్గార ప్రమాణాల గడువును ఏప్రిల్ 2021 వరకు, ట్రాక్టర్లకు 2021 అక్టోబర్ వరకు పొడిగించింది. కేంద్ర రోడ్డ రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ట్రాక్టర్లు, ఇతర నిర్మాణ పరికరాల వాహనాల‌ తయారు చేసే కంపెనీలకు భారీ ఊరట కలుగనుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం టూవీలర్లు, ఫోర్‌వీలర్లకు సంబంధించి బీఎస్ 6 ఉద్గార ప్రమాణాలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు బైక్, స్కూటర్, కారు వంటివి బీఎస్ 6 ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. బీఎస్ 4 వాహనాలతో  పోలిస్తే బీఎస్ 6 వెహికల్స్ ధర చాలా చోట్ల ఎక్కువగానే ఉంది.

అయితే ఇప్పుడు ట్రాక్టర్లు, ఇతర నిర్మాణ పరికరాల వాహనాలకు పాత రూల్స్ వర్తిస్తాయి. కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకు మరింత గడువు లభించింది. దీంతో ఇప్పుడు పాత ఉద్గార ప్రమాణాలు కలిగిన ట్రాక్టర్లను కొనుగోలు చేయవచ్చు.