కేసీఆర్ అవినీతిపై కేంద్రం డేగకన్ను 

సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రం డేగ కన్ను వేసిందని, సీఎం అవినీతి క్లియర్​గా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్  వెల్లడించాయిరు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై తాము ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు​ చేశామని, సరైన సమయంలో విజిలెన్స్ సంస్థలు విచారణ చేస్తాయని తెలిపారు. 

టీఆర్ఎస్  నేతల్లో అహంకారం కనిపిస్తోందని, అధికారం పోయాక వారి బతుకులు బయటపడతాయని మండిపడ్డారు. మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​ను విడిచిపోతారని, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని కేసీఆర్​కు భయం పట్టుకుందని, అందుకే బీజేపీపై, కేంద్ర మంత్రులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సంజయ్  పేర్కొన్నారు.

కేసీఆర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని, ఏపీ సీఎం జగన్ కు దాసోహం అయ్యారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతికి సంబంధించి ఒక సంస్థపై ఐటీ దాడులు జరిగాయని, ఆ దాడులకు ముందు, తర్వాత ఏం జరిగిందో బయటపెడతానని చెప్పారు.

2014 నుంచి ఇప్పటిదాకా నీళ్ల విషయంలో కేసీఆరే తెలంగాణకు అన్యాయం చేశారని సంజయ్ ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ కు మూడు సార్లు ఎజెండా పంపాలన్నా స్పందించలేదని, మంగళవారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే రెండు, మూడ్రోజుల ముందు ఎజెండా పంపుతారా అని ప్రశ్నించారు. ఇది ఎవరిని మోసం చేయడానికని నిలదీశారు. 

2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి వినియోగంపై అంగీకారం కుదిరిందని, 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు తాను ఎంపీ హోదాలో లేటర్​ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఆ తర్వాతే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి స్పందించికృష్ణా బోర్డుకు లెటర్​రాశారన్నారు. సీఎం కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. 2019–20 లో 114 టీఎంసీలు వాడుకోవాల్సిన ఏపీ170 టీఎంసీలు వాడుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడికి పోయారని నిలదీశారు.